అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వరుస సెలవు రోజులు కావడం, పవిత్ర కార్తికంలో దశమి, ఏకాదశి పర్వదినాలు కలిసి రావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రద్దీ మరింత పెరిగింది. ముఖ్యంగా రూ.1,500 వ్రతమండపాల వద్ద తోపులాట జరిగే పరిస్థితి ఏర్పడింది. వ్రతాలకు, దర్శనానికి వెళ్లే క్యూలైన్లు కిటకిటలాడాయి. ప్రధానాలయం చుట్టూ ఉన్న అన్ని ప్రవేశమార్గాలను మూసివేయడంతో మరింత ఇబ్బంది ఏర్పడింది. కొండ దిగువున టోల్ గేటు వద్ద కూడా సరిపడా బస్సులు అందుబాటులో లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన బస్సును ఎక్కేందుకు ఎగబడ్డారు. తరువాత సత్యగిరి నుంచి రత్నగిరికి భక్తులను తీసుకు వచ్చేందుకు టాటా మ్యాజిక్ వాహనాలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 7,136 వ్రతాలు, 51 కల్యాణాలు జరిగాయి. వ్రతాలు, కల్యాణాలు, ప్రసాద విక్రయాలు, దర్శనాలు తదితర వాటి ద్వారా రూ.78 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం కూడా రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు







