UPDATED 27th AUGUST 2022 SATURDAY 07:45 PM
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వానికి ఉన్నట్లుండి పర్యావరణంపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నించారు. పలు వరుస ట్వీట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనేక సూచనలు చేశారు.విశాఖపట్నం పరిశ్రమల కాలుష్యం, విష వాయువు లీకేజీ, వాటి వల్ల మరణాలు వంటి అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఈ ఘటనలకు బాధ్యులైన నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రిషికొండను ధ్వంసం చేసి, ఆక్రమించుకున్నారు. ఉన్నట్లుండి పర్యావరణంపై ఈ ప్రేమేంటి? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు’’ అంటూ ప్రశ్నించారు. మరికొన్ని ట్వీట్లలో ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ, జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి. అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ, అక్కడి సంపదను దోచేస్తూ, పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం.మీమీ పరిధిలో ఉన్న కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి.
సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చింది. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం. మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు.. వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.







