UPDATED 29th APRIL2022 FRIDAY 07:00 AM
CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక నిన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా చర్చజరిగింది.
రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం గవర్నర్కు వివరించారు. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను గవర్నర్ హరిచందన్ కలిశారు. మోదీ, అమిత్ షాతో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సీఎం జగన్తో గవర్నర్ హరిచందన్ చర్చించారు. వైసీపీ పరిపాలన, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి గవర్నర్ నివేదిక ఇచ్చారని ప్రచారం జరిగింది.







