UPDATED 21st JULY 2022 THURSDAY 05:30 PM
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోద అర్హత లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరంకు పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. జాతీయ ప్రాజెక్టు పథకం కింద చేర్చడానికి కాళేశ్వరంకు అర్హత లేదంది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే సిడబ్ల్యుసి అధ్యయనం మొదటి తప్పని సరి అని చెప్పిన కేంద్రం తేల్చి చెప్పింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ ఆమోదం కూడా ఉండాలంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతి కూడా కేంద్రం నుంచి తీసుకోవాలంది. ఈ అనుమతులేమీ తెలంగాణ తీసుకోలేదని తన సమాధానంలో కేంద్ర మంత్రి చెప్పారు.
అనుమతులన్నీ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలన్నారు. హై పవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇచ్చిన తరువాతే.. కేంద్రం కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని 2016, 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.







