UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 12:45 PM
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. దీనిపై ఏర్పాటైన కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం సచివాలయంలో కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించనుంది.
ఈ వివాదానికి నేటితో చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు. ఇదే చివరి సమావేశమని కమిటీ సభ్యులు చెబుతుండడం అందుకు బలం చేకూరుస్తోంది.ధరలకు సంబంధించిన ప్రతిపాదనలను కమిటీ సభ్యులు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత… అధ్యయనం చేసి టికెట్ ధరలపై జగన్ సర్కార్ జీవో రూపంలో నిర్ణయాన్ని వెలువడించే అవకాశం ఉంది. టికెట్ ధరలు, సినీ పరిశ్రమ సమస్యలపై ఇప్పటికే సీఎం జగన్తో చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు, ఆ తరువాత మా అధ్యక్షుడు మంచు విష్ణు చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే.
వారి నుంచి అందిన ప్రతిపాదనలు, సూచనలపై గురువారం జరుగుతున్న సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.ప్రాంతాల వారిగా 3 స్లాబ్లలో టికెట్ల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంచాయతీ, నగర పంచాయతీలు ఒకటో కేటగిరి, మున్సిపాలిటీ లను రెండవ కేటగిరీ, కార్పోరేషన్లను మరో కేటగిరీ గుర్తించి టికెట్ ధరల నిర్ణయానికి కమిటీ సిఫార్సు చేసింది. టికెట్ల ధరల్లో 2 కేటగిరీలు మాత్రమే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే టికెట్ రేట్లపై ఏపీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కమిటీ సభ్యుల సిఫార్సులు, ప్రభుత్వ రేట్లపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.







