Pawan Kalyan : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన లక్ష్యం : పవన్ కల్యాణ్

Updated 5th April 2023 Wednesday 12:05 AM

Pawan Kalyan : వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యం అన్నారు జనసేన అధినేన పవన్ కల్యాణ్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేదే జనసేన, బీజేపీ ఎజెండా అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనేదే తమ అభిమతం అని తేల్చి చెప్పారు పవన్. త్వరలోనే వైసీపీ పాలన నుంచి ఏపీకి విముక్తి కలగాలని పవన్ ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలన నుంచి ఏపీని ఎలా విముక్తి చేయాలో చర్చించామన్నారు పవన్. ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం అని తేల్చి చెప్పారు పవన్.రా ష్ట్రంలో అధికారం సాధించే దిశగా ముందుకెళ్తాం. భవిష్యత్ లో ఏపీకి మంచి రోజులు ఉంటాయి. మంచి ప్రణాళికతో బీజేపీ, జనసేన ముందుకెళ్లబోతున్నాయి. జేపీ నడ్డాతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించా. వైసీపీ పాలన నుంచి ఏపీని ఎలా విముక్తి చేయాలనే దానిపై చర్చ జరిపాం. రాష్ట్ర భవిష్యత్, రాజకీయ ప్రణాళిక గురించి బీజేపీ నేతలతో చర్చించాం. పొత్తులపై చర్చించలేదు. మేము అనుకున్న సమయానికి పొత్తులపై క్లారిటీ ఇస్తాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.(Pawan Kalyan).

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిగాయన్నారు పవన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్య నేతలతో కీలక భేటీలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర పరిణామాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు పవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చర్చించారు. పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన మంగళవారం రాత్రి ముగిసింది. సోమ, మంగళ వారాల్లో బీజేపీ ముఖ్య నేతలతో కీలక భేటీలు సాగాయి. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాల సాగిన ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాలన సంబంధితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు పవన్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు చేశారు. లోతుగా ఈ చర్చలు జరిపారు. ఈ రెండు రోజులపాటు బీజేపీ అగ్రనేతలతో జరిపిన చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమ, మంగళవారాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్ తో రెండు దఫాలు చర్చలు జరిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీతో కూడా చర్చలో పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వానికి తెలియచేశారు. ఇందులో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసి, ఈ ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని షెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు పవన్ కల్యాణ్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us