Updated 11th December 2022 Sunday 11:10 am
Mandous Cyclone : మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో పలు చోట్ల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
సోమశిల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో పెన్నా నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, చాపారు, రాజుపాలెం, ఖాజీపేట, పెద్దముడియం మండలాల్లో వానల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో 250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 149 స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని 388 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
తిరుపతి జిల్లాలో 3 వేల ఎకరాల్లో పంట నష్టం వాటల్లిందని అధికారులు పేర్కొన్నారు. 150 ఇళ్లు దెబ్బతిన్నాయని, 360 విద్యుత్ స్తంభాలు కూలి పోయాయని చెప్పారు. తిరుపతితోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయింది. దీంతో వెంకటగిరి, రావూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.







