UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 09:00 PM
Visakha: ఇటీవల ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని ఘనంగా నిర్వహించిన విశాఖపట్నం మరో వేడుకకు ముస్తాబైంది. బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్-2022 (Milan- 2022) సాగర తీరంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 8 రోజుల పాటు రెండు దశల్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి.
మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. కాగా తొలిరోజున హార్బర్ దశలో సాంకేతిక అంశాలను పరిశీలించారు వివిధ దేశాల నేవీల ప్రతినిధులు. వారికి భారత నౌకాదళం పలు అంశాలను వివరిస్తూనే, వారి నుంచి సాంకేతిక విషయాలను తెలుసుకున్నారు. కాగా నేడు (ఫిబ్రవరి26) తూర్పు నౌకాదళంలో నేవీల ఆధునికతపై సదస్సు జరగనుంది. దీనికి పలు దేశాల నేవీ అధికార్లు హాజరుకానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సాంగత్యం, పొందిక, సహకారం లక్ష్యాలుగా ఈ మిలన్ను నిర్వహిస్తున్నారు.కాగా మిలన్-2022లో భాగంగా రేపు (ఫిబ్రవరి 27) విశాఖ ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది.
ఇందులో నేవీ కవాతుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్ లను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ సాంస్కృతిక బృందాలతో నేవీ నిర్వహించే ఈ పరేడ్ ఆకర్షణీయంగా సాగనుంది.
నౌకాదళం సాహస విన్యాసాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. గగన తలంలో ఎయిర్ క్రాప్టులు, హెలీకాప్టర్లు సాహస విన్యాసాలతో నగరవాసులను అలరించనున్నాయి.
మిలాన్-2022 ఉత్సవాల కోసం ఇప్పటికే ఆర్కే బీచ్లో నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేసింది. అటు మిలాన్-2022 నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు, విశాఖ పోలీసు కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా . బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కుహోటల్ కూడలి వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు సీపీ.







