UPDATED 13th NOVEMBER 2022 SUNDAY 3:05 PM
Pawan Kalyan: జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న జగనన్న కాలనీని పవన్ సందర్శించారు. మరోవైపు పవన్ పర్యటన కోసం అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. జనసేన కార్యకర్తలు ఆనందపురం జంక్షన్ వద్ద భారీ గజమాలతో పవన్ను సత్కరించారు. అభిమానులతో కలిసి పవన్ జగనన్న కాలనీ సందర్శనకు ర్యాలీగా బయల్దేరారు. సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జగనన్న కాలనీకి వెళ్లి అక్కడ నిర్మితమవుతున్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ప్రజల కోసమే పార్టీ పెట్టాం. అవినీతికి వైసీపీ కేరాఫ్ అడ్రస్గా మారింది.ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ పట్టించుకుందా? గడపగడపకు కార్యక్రమంలో వైసీపీని ప్రజలు నిలదీయాలి. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించాలి. జగనన్న కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే ఈపాటికి ఇళ్లు పూర్తయ్యేవి. 12 వేల ఇల్లు కట్టనివాళ్లు రాజధానిని నిర్మిస్తారా? రూ.15 వేల కోట్ల వరకు డబ్బు దోచేశారు. ఈ దోపిడీ గురించి స్వయంగా మోదీకి వివరిస్తా. వచ్చే జనసేన ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తాం. అవినీతికి పాల్పడిన వాళ్లు జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. చరిత్ర ఉన్న పార్టీలు కూడా జనసేనకు భయపడుతున్నాయి.
వైసీపీ నేతల గూండాగిరికి భయపడం. మత్స్యకారులకు హాని కలిగించే ఏ జీవోనైనా అడ్డుకుంటాం. యువతను మరోసారి కోరుతున్నా. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.







