UPDATED 7th FEBRUARY 2022 MONDAY 01:30 PM
విజయవాడ (రెడ్ బీ న్యూస్): కృష్ణాజిల్లా ఉయ్యూరులో సోమవారం ఉదయం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాతకక్ష కోణంలోనే.. ఈ హత్యాయత్నం జరిగినట్టు విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వివరించారు.
సోమవారం మధ్యాహ్నం డీసీపీ హర్షవర్ధన్ 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ఘటన తాలూకు వివరాలు వెల్లడించారు. షరీఫ్ అనే వ్యక్తి షేక్ షారు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్యలో ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వివరించారు.ఉయ్యూరులో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్న షరీఫ్ అనే వ్యక్తి.. దగ్గర బంధువైన షేక్ షారుతో కలిసి .. 2018లో బంధువుల వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహ వేడుకలో షేక్ షారు.. కొంతమంది పెద్దలతో గొడవ పడ్డాడు. గొడవ జరగకుండా ఇరువర్గాల వారికి షరీఫ్ సర్దిచెప్పి అక్కడ నుండి పంపించివేశాడు. అయితే అప్పటి నుండి షరీఫ్ కనపడిన ప్రతిసారి షేక్ షారు వ్యంగ్యంగా వ్యవహరించేవాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం షరీఫ్ షాపు తీసిన తరువాత షారు వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవరించడంతో, ఆగ్రహం కట్టలుతెంచుకున్న షరీఫ్.. కత్తితో షారుపై దాడి చేశాడు.
దాడి అనంతరం షేక్ షారు పరారవగా.. పోలీసులు అతన్ని వెతికి పట్తుకున్నారు. ప్రస్తుతం షరీఫ్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అతను ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, బాధితుడు షేక్ షారుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీసీపీ తెలిపారు. మొదట అనుమానించినట్లుగా ఈకేసులో ప్రేమ, ఆర్ధిక కారణాలు లేవని డీసీపీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు.







