ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: మహారాష్ట్రలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. నకిలీ అధికారుల వేధింపులకు ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులమంటూ ఇద్దరు దుండగులు భయభ్రాంతులకు గురిచేయడంతో సదరు నటి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయికి చెందిన ఓ యువ నటి (28) డిసెంబరు 20న ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ ఫైవ్స్టార్ హోటల్లో పార్టీకి వెళ్లింది. అయితే అక్కడకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు తాము ఎన్సీబీ అధికారులమంటూ.. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. అప్పటినుంచి డబ్బుల కోసం ఆమెకు పదేపదే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన నటి.. తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి (38), పర్వీన్ రఘునాథ్ వాలింబే (35)ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్సీబీపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని ఆరోపించారు. ‘బాలీవుడ్ నటీమణుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్సీబీనే ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసింది. నకిలీ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను గుంజుతోంది. ఎన్సీబీ ప్రైవేట్ ఆర్మీ వేధింపులు తట్టుకోలేకే సదరు నటి బలవన్మరణానికి పాల్పడింది’ అని మాలిక్ ఆరోపించారు. అయితే నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీబీ వెల్లడించింది.







