అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: పీఆర్సీ, ఫిట్మెంట్పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎస్ సమీర్ శర్మ, కమిటీ సభ్యులు కలిసి తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందించారు. నివేదికను సీఎం జగన్ పరిశీలించిన అనంతరం సచివాలయంలో సీఎస్ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ, ఫిట్మెంట్పై వివరాలు వెల్లడించారు. ‘‘ఫిట్మెంట్పై సీఎం జగన్కు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్సీ నివేదికను వెబ్సైట్లో ఉంచుతాం. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్మెంట్ను పరిశీలించాం. పీఆర్సీ, ఫిట్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 7 రకాల సిఫార్సులు చేశాం. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలి.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలి.. 2 అంశాలను అమలు చేయక్కర్లేదు... ఇలా ప్రతిపాదనలు సూచించాం. 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిటమెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిటమెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 14 శాతం ఫిటమెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 30 శాతం ఫిటమెంట్.. ఇలా 7 రకాల ప్రతిపాదనలు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్మెంట్ సిఫార్సు చేశాం. అధికారులు, నిపుణులతో చర్చించాక ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్ 3 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. పెండింగ్ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎస్ వివరించారు







