Updated 27th April 2017 Thursday 12:10 PM
పెద్దాపురం: పెద్దాపురం మండలం కాండ్రకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ( పి హెచ్ సి) సిబ్బంది చిన్నారికి వైద్య సహాయం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు పి హెచ్ సి ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యుడు జోకా నానాజి మనుమరాలు లంకా పావనశ్రీ తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్క కరిచింది. ఆ చిన్నారికి యాంటీ రేబిస్ వాక్సిన్ వేయించేందుకు పి హెచ్ సి కి తీసుకువెళ్లడంతో అక్కడ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రామలక్ష్మి, పబ్లిక్ హెల్త్ నర్స్ కె. జ్యోతి చిన్నారికి వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. పైగా దురుసుగా మాట్లాడి తమ డ్యూటీ టైం అయిపోయిందని సమాధానం చెప్పారు. దీంతో చిన్నారిని రాజమహేంద్రవరం తీసుకుని వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్థులకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆరోగ్య కేంద్రం సిబ్బందిని లోపలికి వెళ్లనీయకుండా గేటుకు తాళాలు వేశారు. తమకు సమాధానం చెప్పేంతవరకూ లోపలికి అనుమతించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ జె. శ్రీలత గ్రామస్థులతో మాట్లాడి వారిని శాంతిపచేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారికి విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామస్థులు శాంతించి ఆందోళన విరమించారు.







