UPDATED 14th JUNE 2017 WEDNESDAY 6:00 PM
కాకినాడ: జెఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆధారిత (ఆన్ లైన్) పద్ధతిలో ఈ సంవత్సరం ఏప్రిల్ 24, 25, 26, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ లో నిర్వహించిన ఎపి ఎంసెట్-2017 ప్రవేశపరీక్ష మూడవ దశ ఫలితాలను ఈ నెల 14 న విడుదల చేశామని, అలాగే ర్యాంక్ కార్డులను ఎంసెట్ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు జేఎన్టీయూకె కన్వీనర్ ప్రొఫెసర్ సి.హెచ్. సాయిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం లో ఎపి, తెలంగాణా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ద్వారా ఉత్తీర్ణులైన 3863 మంది అభ్యర్థులకు ఇతర బోర్డుల నుంచి ఇంటర్ తో పాటు ఎంసెట్ తో అర్హత సాధించి డిక్లరేషన్ ఫారం సమర్పించిన 185 మంది అభ్యర్థులకు ర్యాంకులను కేటాయించినట్లు చెప్పారు. అలాగే అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో ఎపి, తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ద్వారా ఉతీర్ణులైన 1318 మంది అభ్యర్థులకు ఇతర బోర్డుల నుంచి ఇంటర్ తో పాటు ఎంసెట్ అర్హత సాధించి డిక్లరేషన్ ఫారం సమర్పించిన 63 మంది అభ్యర్థులకు ర్యాంకులను కేటాయించడం జరిగిందన్నారు. మొత్తంగా ఎంసెట్ లో 5429 మందికి మూడవ దశలో ర్యాంకులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఎపి ఎంసెట్ లో అర్హత పొంది ఇంకా డిక్లరేషన్ ఫారం సమర్పించని అభ్యర్థులు వెబ్ సైట్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ అభ్యర్థులకు విడివిడిగా పొందుపరిచిన డిక్లరేషన్ ఫారంను డౌన్ లోడ్ చేసుకుని 10+2 మార్కుల జాబితాను జత చేసి వెబ్ సైట్ లో పొందుపరిచిన ఇమెయిల్ ఐడి , పోస్ట్ ద్వారా కాని ఎపి ఎంసెట్ కార్యాలయానికి అందచేయాలన్నారు. డిక్లరేషన్ ఫారంను అటెస్టేషన్ తో కూడిన మార్కుల జాబితాను పంపాలని అప్పుడే వారి మార్కుల వెయిటేజీ తీసుకుని ఎంసెట్ మార్కులతో కలిపి ర్యాంకులను వెల్లడిస్తామని తెలిపారు. ఎపి ఎంసెట్-2017 పై సందేహాల నివృత్తికి విద్యార్థులు, తల్లిదండ్రులు 0884 -2340535, 2356255 నెంబర్లలో సంప్రదించాలని లేదా helplineapemcet 2017@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని కన్వీనర్ సూచించారు.







