రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ హీరోగా నటించిన చిత్రం ‘వాలిమై’. హెచ్.వినోద్ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు తమిళ ట్రైలర్ గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు దిశగా దూసుకెళ్తోంది. సుమారు 30 నిమిషాల్లోనే ఈ ట్రైలర్ 2 మిలియన్ల (20 లక్షలు) వ్యూస్ దక్కించుకుందని సోనీ మ్యూజిక్ సంస్థ వెల్లడించింది. ట్రైలర్ విషయానికొస్తే.. బైక్ ఛేజింగ్, పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అజిత్, కార్తికేయ.. ఇద్దరి లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజిత్ అభిమానులు కోరుకునే యాక్షన్ హంగామా ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఉన్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. జీ స్టూడియోస్ సంస్థ, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, ఛాయాగ్రహణం: నీరవ్ షా. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘బలం’ పేరుతో తెలుగులో విడుదలకాబోతుంది.







