UPDATED 1st SEPTEMBER 2022 THURSDAY 04:50 PM
TDP Chandrababu Respond : ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే ఇప్పుడు జగన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండు సార్లు నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యం తెలుగుదేశం పార్టీయేనని, మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తుందన్నారు. అవగాహన లేనివాళ్లే సంక్షేమం గురించి తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర విభజన వల్ల ప్రజల్లో భయాందోళనలు ఎన్నో ఉన్నా, ఆర్థికలోటులోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ఇక్కడ సంక్షేమం, ఇతర కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు.ఎవరైనా చేస్తారులే అనే ఒక ఆలోచన ప్రజల్లో కలగటానికి ఇది కూడా ఒకటి కావొచ్చన్నారు.
వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంటి నిండా నిద్రపోవట్లేదన్నారు. వ్యవస్థలు నాశనమయ్యాక ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చేసిందన్నారు.







