Updated 31st May 2023 Wednesday 1:30 pm
MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు (YS Viveka case)లో అవినాశ్ రెడ్డి (Avinash Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ బుధవారం తుదితీర్పు వెలువరించింది. అవినాశ్ రెడ్డి లాయర్ వాదనలు పరిగణలోకి తీసుకున్నకోర్టు.. అతనికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే, సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రతి శనివారం ఉదయం 10.30 నిముషాల నుండి సాయంత్రం 4.30 వరకు సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించాలని తెలంగాణ హైకోర్టు సీబీఐకు సూచించింది. అవినాశ్ రెడ్డి ఐదు లక్షల షూరిటీలు రెండు సమర్పించాలని, కేసు పూర్తి అయ్యేంత వరకు దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని హైకోర్టు ఆదేశించింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ 30పేజీల ఆర్డర్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయని, సీబీఐ ఆధారాలను సేకరించలేక పోయిందని అభిప్రాయపడింది. సాక్షులను ప్రభావితం చేశారని అనడంలో ఆధారం లేదని, సాక్ష్యాలను తారుమారు చేశాడనడంలో ఎవిడెన్స్ లేవని పేర్కొన్న హైకోర్టు.. చెప్పుడు మాటలు ఆధారంగా దర్యాప్తు ఉందని సీబీఐపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు ఊహాజనతమైన విచారణ మాత్రమే సాగిందని కోర్టు పేర్కొంది.
హైకోర్టు ఆర్డర్ కాపీలో పలు మీడియా సంస్థలపై (10టీవీ కాదు) హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నతమైన స్థాయిలో ఉండి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఇటువంటి ఆరోపణలు చేయడం మీడియాకు హుందాగా ఉండదని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనే విషయం చీఫ్ జస్టిస్కు వదిలేస్తున్నామని పేర్కొన్నారు. రెండు టీవీ ఛానల్స్లో మే 26న జరిపిన డిబేట్ల లింక్లు డౌన్లోడ్ చేయాలని రిజిస్ట్రీకు హైకోర్టు ఆదేశించింది. అవినాశ్ ఆర్డర్ కాపీని, వీడియోలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు పెడతానని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
పలు మీడియా ఛానల్స్ డిబేట్లో కొంత మంది వ్యక్తుల ద్వారా తనపై ఆరోపణలు చేయించారని, మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలని అనుకున్నానని, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించానని అన్నారు. సస్పెండ్ అయిన మెజిస్ట్రేట్ ఒకరు హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరమని, ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని న్యాయమూర్తి ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.







