UPDATED 6th APRIL 2022 WEDNESDAY 10:20 AM
Palnadu District: ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 10.50 గంటలకు పీఎన్సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదికపై వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు.
అనంతరం సీఎం జగన్ 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటిసారి సీఎం జగన్ ఓ జిల్లా కేంద్రానికి విచ్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 13 జిల్లాలుగా ఉన్న ఏపీలో ఏప్రిల్ 1 నుంచి 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా ప్రకటించారు. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటలో ఇప్పటికే జిల్లా పాలనా యంత్రాంగం పనులు ప్రారంభించింది. ఈక్రమంలో గురువారం సీఎం జగన్ నరసరావుపేటలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.







