Kurnool Gold Mine : కర్నూలులో బంగారు నిక్షేపాలు.. దేశంలోనే తొలి గోల్డ్ మైన్ ఏర్పాటు..!

UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 01:30 PM

కర్నూలు: కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు అతిత్వరలో ప్రారంభం కానున్నాయి. అంతకుముందు పైలట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సత్పలితాలు రావడంతో బంగారు నిక్షేపాల కోసం గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడ్డాయి.

ఈ క్రమంలోనే గోల్డ్ మైన్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇక్కడే ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాలను వెలికితీసేందుకు రెడీ అవుతోంది. తుగ్గలి, మద్దికెర వంటి ప్రాంతాల్లో గోల్డ్ మైన్ ఉందనే విషయం 1994లోనే జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) సర్వే గుర్తించింది. మైనింగ్‌ రంగంలో విదేశీ పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆహ్వానించిన తర్వాత 2005 ఏడాదిలో జియో మైసూర్‌ సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్‌ మైన్‌ నిర్వహణకు అప్లయ్ చేసుకుంది. ఆ దరఖాస్తును అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం కూడా పరిశీలించింది. అనంతరం తెలుగు రాష్ట్రాల విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మైనింగ్‌ అనుమతులకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత 2013లో గోల్డ్ మైనింగ్ వెలికితీతకు అనుమతులు లభించాయి. 2014లో జియో మైసూర్‌ కంపెనీ గోల్డ్ మైనింగ్ ప్రాంతాల వెలికితీసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఈ క్రమంలోనే గోల్డ్ నిక్షేపాలు కలిగిన ప్రాంతాల్లో 350 వరకు ఎకరాలను జియో మైసూర్‌ సంస్థ కొనేసింది. మరో 1,500 ఎకరాలను కూడా ఈ సంస్థ లీజుకు తీసుకుంది. లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల వరకు కౌలు చెల్లిస్తోంది. ఆ 350 ఎకరాల్లో మైనింగ్, డంప్‌ యార్డ్, ప్రాసెసింగ్‌ యూనిట్, వాటర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్‌, మొత్తం 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేయించింది. గోల్డ్ మైన్ నాణ్యత, మైనింగ్‌ వల్ల కలిగే లాభనష్టాలపై అంచనా వేసేందుకు మైసూర్ సంస్థ పైలట్‌ ప్రాజెక్ట్‌ కూడా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడంతో ఇక పూర్తిస్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్లాంట్‌ ఏర్పాటుకు రెడీ అయిపోయింది కంపెనీ.

ఏప్రిల్ నుంచే ప్లాంట్ పనులు..

ఈ ప్లాంట్ ఏర్పాటుకు యంత్ర సామగ్రిని కూడా కంపెనీ కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తోంది. 12 నెలల్లో పూర్తి చేయనుంది. రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. భారతదేశంలో 1880 సంవత్సరంలో కోలార్‌ గోల్డ్‌ మైన్‌ ప్రారంభించింది. 1945లో బ్రిటిష్‌ హయాంలోనే రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను ప్రారంభించింది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్‌ మైనింగ్‌ చేపట్టలేదు.

తొలి గోల్డ్‌ మైనింగ్‌ ప్లాంట్‌ ఇప్పుడు జియో మైసూర్‌ సంస్థనే ఏర్పాటు చేయబోతోంది. అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ ఈ బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. 25 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ ఈ గోల్డ్ మైన్ లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపించింది. కానీ, అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా కంపెనీ ముందుకు రాలేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us