UPDATED 11th JULY 2022 MONDAY 06:20 PM
Chandrababu Key Decision : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించింది. మద్దతుపై ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని, అందుకే మద్దతు ప్రకటించామన్నారు చంద్రబాబు. రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఎవరికి అనేది ఆసక్తిని రేపింది. ఎన్డీయే లేదా విపక్ష కూటమి తమ మద్దతు కోరిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తూ వచ్చింది. లేకుంటే తటస్థంగా ఉండాలనే ఆలోచన ఒక దశలో చేసింది.
కానీ, ఎన్నికలకు కేవలం వారం సమయం ఉన్న తరుణంలో.. రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము అమరావతికి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతిపాదించిన గిరిజిన మహిళ ముర్ముకు మద్దతుగా నిలవాలని డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ముర్ముకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.. సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని పేర్ని నాని అధికారికంగా వెల్లడించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏయేకు దూరం అయిన చంద్రబాబు.. తిరిగి ఇప్పుడు ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలోనూ ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ, వైసీపీ.. ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్ నాధ్ కోవింద్ కు మద్దతిచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. టీడీపీ తొలి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ నిర్వహిస్తారు. 21న ఫలితాలను వెల్లడిస్తారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది. పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. వీళ్లదరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉంటుంది.







