Updated 2 February 2022 Wednesday 01:30 PM
గుంటూరు (రెడ్ బీ న్యూస్): గుంటూరులోని జిన్నా టవర్ వివాదం కొనసాగుతునే ఉంది. భారతదేశం చీలిపోవటానికి పాకిస్థాన్ దేశం ఏర్పడటానికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా టవర్ కు పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకు వేసి ఈ టవర్ ను కూల్చివేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా మరోసారి గుంటూరులోని జిన్నా టవర్ తెరపైకి వచ్చింది. ఎలాగంటే..
గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి పుల్స్టాప్ పెట్టాలని గుంటూరు జిల్లా యంత్రాంగం కాస్త తెలివిగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. జాతీ జెండా రంగులు వేస్తే ఎటువంటి వివాదం రాదని అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది. దీంతో జిన్నా టవర్కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. అనంతరం ఫిబ్రవరి 3న టవర్ వద్ద జాతీయ జెండాను ఎగుర వేసేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
కొన్ని దశాబ్దాలకు ముందు గుంటూరు నగరంలో మహ్మద్ అలీ జిన్నా రాకకు గుర్తుగా జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం రాక ముందే మహ్మద్ ఆలీ జిన్నా గుంటూరులో బహిరంగ సభకు రావటానికి ఓకే కూడా చెప్పారు.
కానీ అనివార్య కారణాలతో జిన్నా గుంటూరు పర్యటన రద్దైంది. ఆయన పర్యటించలేకపోవటంతో ఆయన పేరు మీద టవర్ నిర్మించారు. గత కొంతకాలంగా ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ టవర్కు పేరు మార్చాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
భారత దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలనే వాదనను బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ గుంటూరు అధికార యంత్రాంగం టవర్ కు రంగులు మార్చారు. జాతీయ జెండాను కూడా ఎగురవేయాలని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు. 3వ తేదిన జాతీయ జెండా ఎగుర వేస్తామంటోంది జిల్లా యంత్రాంగం..







