UPDATED 24th FEBRUARY 2018 SATURDAY 5:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థినీ, విద్యార్థులు రక్తదానం చేసినట్లు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అపాయకార పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడవచ్చని అన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి. సత్యనారాయణ, నిర్మలాదేవి, తదితరులు పాల్గొన్నారు.







