Updated 26 January 2022 Wednesday 07:35 AM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. తద్వారా భారతదేశ సంస్కృతి, వారసత్వపు సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించింది. జనవరి 26న, భారత సాంస్కృతిక వారసత్వం, సైనిక శక్తి, అభివృద్ధికి సంబంధించిన సంగ్రహావలోకనం (Overview)ని ప్రపంచం చూస్తుంది. ఇది ప్రతీ భారతీయుడికి గర్వకారణం. ప్రత్యేకంగా డూడుల్ని చూస్తే.. ఒంటె, ఏనుగు, గుర్రం, ఢోలక్ త్రివర్ణ పతాకం రూపంలో గూగుల్ డూడుల్లో పెట్టింది. గత ఏడాది 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గూగుల్ తన డూడుల్లో దేశంలోని అనేక సంస్కృతులను ప్రపంచానికి చూపించింది. అదే సమయంలో, 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతిని చూపుతూ, రంగురంగుల డూడుల్ను తయారు చేసింది. దీనితో పాటు జాతీయ పక్షి నెమలి, కళతో పాటు నృత్యం కూడా గత కొన్నేళ్లుగా చేసిన డూడుల్స్లో కనిపించాయి.
భారత్కు ప్రత్యేకమైన రోజు:
భారత గణతంత్ర దినోత్సవం దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఈరోజు (26 జనవరి) ప్రత్యేకంగా జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి(1935) బదులు భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో అప్పటి నుంచి భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. భారత రాజ్యాంగసభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా 1950 జనవరి 26న ఆవిర్భవించింది. రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రాజ్పథ్లో దేశ బలం, సంస్కృతికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉదయం 10గంటల 5నిమిషాలకు జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారు.







