UPDATED 16th SEPTEMBER 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో
రెండురోజుల పాటు జరిగిన జాతీయస్థాయి టెక్ ఫస్ట్ వేద 2 కె 17 కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ భావి ఇంజినీర్ల సృజనాత్మక ఆలోచనలకు వేద చక్కని వేదికగా నిలిచిందని, వారి ప్రతిభకు కొదవలేదని, సరైన మార్గంలో వారికి తోడ్పాటునందిస్తే అద్భుతమైన ఆవిష్కరణలు చేసి చూపిస్తారన్నారు. ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు తగు తోడ్పాటునందిస్తే నవభారత నిర్మాణం చేస్తారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రమాద రహితమైన రోడ్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అను రొటేట్ బ్రిడ్జి, హైడ్రాలిక్ బ్రిడ్జి , మెట్రో సిస్టం వంటి వివిధ ప్రాజెక్ట్ నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద టెక్ ఫెస్ట్ ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని, నూతన ఆలోచనలతో వివిధ కళాశాలల నుండి వచ్చిన వారితో కలిసి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలలో విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల క్యాంపస్ డైరెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి , డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, డాక్టర్ ఆర్. శ్రీనివాస్, వివిధ బ్రాంచ్ లకు చెందిన హెచ్వోడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







