UPDATED 14th SEPTEMBER 2022 WEDNESDAY 06:50 PM
Amaravati Assigned Land Scam : అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్ను రిమాండ్కు పంపాలని న్యాయమూర్తిని కోరారు. కానీ న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరించారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లకు రిమాండ్ వర్తించదన్నారు. దీంతో ఇద్దరికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి సీఐడీ పోలీసులు వదిలేశారు.
11 వందల ఎకరాల అసైన్డ్భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. 169 ఎకరాల్లో అవకతవకలకు పాల్పడ్డారని కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు.
రాజధాని గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి.రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా పేమెంట్లు జరిపినట్టు సీఐడీ నిర్ధారించింది. ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ తేల్చింది. రామకృష్ణ హౌసింగ్ కంపెనీ- నారాయణ మధ్య 15 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది.







