UPDATED 1st AUGUST 2022 MONDAY 11:50 PM
Tirumala : తిరుమల కొండపై కోవిడ్ కారణంగా నిలిపి వేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని జానపద శైలిలో భజనలు చేస్తున్నారని తెలిపారు.
ప్రతిరోజూ ఒక్కో జట్టులో 15 మంది చొప్పున 12 బృందాల్లో కళాకారులు పాల్గొంటారని, ఏడాది పొడవునా హరినామ సంకీర్తన కార్యక్రమం నడుస్తుందని ఆయన అన్నారు. 7500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామని ఈఓ తెలిపారు.
ఒక్కో బృందం రోజుకు రెండు గంటలపాటు వివిధ షిఫ్టుల్లో ప్రదర్శన ఇస్తుందని ఈఓ తెలిపారు. ఈ కళాకారులకు వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు







