UPDATED 7th MARCH 2022 SUNDAY 01:25 PM
Tirumala : తిరుమలలో రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.
తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ కితాబిచ్చారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వి.రమణ దంపతులు శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టారు.







