Updated 1st December 2022 7:10 pm
Chandrababu Naidu: పోలవరం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోనే రోడ్డుపై చంద్రబాబు నాయుడు కాసేపు తమ పార్టీ నేతలతో కలిసి బైఠాయించారు. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త కొత్త జీవోలతో మభ్య పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం సందర్శనకు వచ్చినా అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందంటూ అడ్డుకుంటున్నారని, అలాగైతే పోలవరానికి ఎప్పుడు రావాలని చెబుతారో అప్పుడే వస్తానని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులను తామే పూర్తి చేశామని, డయాఫ్రంవాల్ ఏమైందో తెలియదని చంద్రబాబు అన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టును నాశనం చేశారని చెప్పారు. ప్రభుత్వం 3 డెడ్ లైన్లు మార్చినప్పటికీ కనీసం 3 శాతం పనులను కూడా పూర్తి చేయలేదని అన్నారు. పోలవరం నిర్వాసితుల త్యాగాలను వెలకట్టలేమని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని ప్రత్యక జిల్లాగా చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.







