Updated 30 January 2022 Sunday 08:10 AM
కరీంనగర్ (రెడ్ బీ న్యూస్): రోడ్డు ప్రమాదలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వాహనదారులు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ కమాన్ వద్ద బీభత్సం సృష్టించిన ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. బాధితులంతా రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకుని బ్రతికేవారు.
అతివేగంతో వచ్చిన కారు గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద ధాటికి ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఆరుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







