UPDATED 10th NOVEMBER 2022 THURSDAY 9:10 PM
Thirumala : కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణు పూజల్లో భాగంగా గురువారం తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని వసంత మండపంలో కొలువుతీర్చారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు నల్లూరు వెంకట మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు. ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థన, శ్రీసూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు.
అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. తరువాత భక్తులు గోప్రదక్షిణ చేశారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.







