Updated 12th May 2023 Friday 8:10 pm
Cyclone Mocha Impact : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోచా తుపాను ముప్పు తప్పింది. అండమాన్ లో పోర్టు బ్లెయిర్ కు 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతోంది. దీంతో తుపాను ముప్పు నుంచి ఏపీ బయటపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక, పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న అనంతపురము జిల్లా శెట్టూరులో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మోచా తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ దగ్గర ఈ నెల 14న తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం తుపాను పోర్ట్ బ్లెయిర్ కు నైరుతి దిశలో 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బంగ్లాదేశ్ కాక్స్ బజార్ కు దక్షిణ నైరుతి దిశలో 1190 కిలోమీటర్ల దూరంలో మయన్మార్ కు దక్షిణ నైరుతి దిశలో 1100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ నెల 14న తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.







