జమ్మూ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణో దేవీ (Mata Vaishno Devi) ఆలయంలో జరిగిన దుర్ఘటనకు దారి తీసిన కారణాన్ని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. కొంతమంది యువకుల మధ్య చెలరేగిన చిన్నపాటి ఘర్షణ చివరకు తొక్కిసలాటకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డీజీపీ.. పోలీసులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించారని తెలిపారు. ఘర్షణ చెలరేగిన కొన్ని నిమిషాల్లోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే స్పందించడం వల్లే నష్టాన్ని పరిమితం చేయగలిగామని తెలిపారు. అప్పటికీ భారీ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం విచారం కలిగించిందన్నారు. కొత్త సంవత్సరం వేళ శనివారం వేకువజామున మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రంతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్.. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. గాయాలైనవారి చికిత్సకయ్యే ఖర్చును ఆలయ బోర్డే భరిస్తుందని హామీ ఇచ్చారు.







