యువతరానికి అప్పగిస్తాం
నాయకత్వ మార్పును వేగవంతం చేస్తాం
నేను, ఇతర సీనియర్లు మార్గదర్శకత్వం చేస్తాం
‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో ముకేశ్ స్పష్టీకరణ
అంబానీ నోట.. తొలిసారిగా వారసత్వ మాట
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ ఛైర్మన్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ తొలిసారిగా పేర్కొన్నారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీకి సంబంధించిన వారసత్వ ప్రణాళికలపై ఇప్పటి వరకూ నోరువిప్పని ముకేశ్ అంబానీ(64) మొదటిసారిగా ‘ఇకపై నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేస్తామ’ని అనడం విశేషం. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు.
ముకేశ్తో పాటు.. ఇతర సీనియర్లూ..
గ్రూప్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో ఆయన మాట్లాడుతూ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బహుళ జాతి కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది. తాజాగా అడుగుపెడుతున్న స్వచ్ఛ, హరిత ఇంధన రంగంతో పాటు రిటైల్, టెలికాం వ్యాపారాలు అందుకు దోహదం చేస్తాయి. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యం. రిలయన్స్ ఇపుడు ఆ అత్యంత ముఖ్యమైన నాయకత్వ మార్పు ప్రక్రియలో ఉంది. ఆ మార్పు నాతో పాటు, నాతరం సీనియర్ వ్యక్తుల నుంచి తదుపరి తరం అయిన యువ నాయకులకు జరుగుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నాన’ని అన్నారు. ఈ ప్రసంగాన్ని అంబానీకి చెందిన వార్తా సంస్థ న్యూస్18.కామ్ ప్రచురించింది.







