ఎటపాక, 13 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): మావోయిస్టు పార్టీకి చెందిన అయిదుగురు దళ సభ్యులు శనివారం ఎటపాక పోలీస్స్టేషన్లో ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, సీఆర్పీఎఫ్ 39బీ కమాండెంట్ ప్రసన్నకుమార్, చింతూరు డీఎస్పీ ఖాదర్ బాషా ఎదుట లొంగిపోయారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి డివిజన్ కమిటీకి చెందినవారని చెప్పారు. అరెస్టు చేసిన వారిలో చింతూరు మండలం అల్లివాగుకు చెందిన ఆజాద్, ఎటపాక మండలం జగ్గవరానికి చెందిన రవ్వా భీమయ్య అలియాస్ భీములు, ఎటపాక మండలం విస్సాపురం పరిధిలోని గొల్లగుప్పకు చెందిన మడివి లక్ష్మి అలియాస్ నవిత, పద్దం శాంతి అలియాస్ కవిత, మడివి జోగమ్మ అలియాస్ జోగి ఉన్నట్లు చెప్పారు. మన్యంలో అభివృద్ధికి ఆకర్షితులు కావడం, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసుగు చెందడంతోపాటు మహిళలతో మావోయిస్టుల అసభ్య ప్రవర్తన, ఇతర కారణాలతో వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. అనంతరం లొంగిపోయిన సభ్యులకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. వారందరికీ పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దళ సభ్యుల లొంగుబాటుకు కృషి చేసిన సీఐ గీతారామకృష్ణను అభినందించారు. ఎస్సై జ్వాలాసాగర్, చినబాబు, సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు అందించారు.







