UPDATED 15th APRIL 2022 FRIDAY 07:00 PM
Janasena On Amma Odi : ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో జగనన్న అమ్మఒడి ఒకటి. అయితే, అమ్మఒడి పథకాన్ని లబ్దిదారులకు దూరం చేసేందుకు ప్రభుత్వం కొత్త ఆంక్షలు తెస్తోందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
‘అమ్మ ఒడి’ పథకానికి మంగళం పాడేందుకే ప్రభుత్వం కొత్త ఆంక్షలు తెచ్చిందని ఆయన ఆరోపించారు. నవ రత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకునేందుకు సిద్ధమైందన్నారు. అందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకాన్ని క్రమంగా పక్కకు పెట్టేసేందుకే ఆంక్షలు విధిస్తోందన్నారు నాదెండ్ల మనోహర్. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పథకం నుంచి ఒక్క నయా పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్పారు. లబ్ధిదారులు ప్రశ్నిస్తే జూలైలో ఇస్తామని చెప్పారని అన్నారు.(Janasena On Amma Odi)
రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని ఇప్పటి నుంచే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టిందన్నారు. అందులో భాగంగానే విద్యుత్ వాడకం 300 యూనిట్ల దాటితే అమ్మఒడి కట్ చేస్తామని ప్రకటించారని చెప్పారు. వేసవి కాలంలో విద్యుత్ వాడకం కచ్చితంగా పెరుగుతుందన్న నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వాడకం ప్రకారం చూస్తే కచ్చితంగా ఎక్కువ యూనిట్లు ఉంటాయన్నారు. కావాలనే ఈ సమయాన్ని ఎంచుకుని అమ్మఒడి పథకానికి పేద తల్లులను అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు.
పేద తల్లులు తమ బిడ్డలను చదివించుకునేందుకు డబ్బులు ఇస్తానని ప్రచారంలో చెప్పుకున్న జగన్.. అమలు చేసే సమయంలో ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి లబ్ధి ఇవ్వకుండా ఎగ్గొట్టారని మండిపడ్డారు. 2022-23లో కూడా అమ్మ ఒడికి విద్యార్థులను దూరం చేసే పనిలో ఉన్నారని చెప్పారు. క్రమంగా ఈ పథకానికి మంగళం పాడబోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రణాళిక లేని వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందని, దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.(Janasena On Amma Odi)”పేదలు చాలా వరకు చిన్న ఇళ్లలో నివాసం ఉంటారు. వాళ్లకు నాలుగైదు వాటాలకు కలిపి ఒక మీటర్ ఉంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా విద్యుత్ వాడకం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డుల్లో జిల్లా పేరు మార్చుకోవాలనడం కరెక్ట్ కాదు. ఈ నిబంధన మండుటెండల్లో ప్రజలను ఆధార్ కేంద్రాల ముందు నిలబెడుతుంది.
కాయకష్టం చేసుకుని బతికేవాళ్లు ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం కచ్చితంగా రెండుమూడు రోజులు పనులకు దూరం కావాల్సి ఉంటుంది. ఏదో విధంగా తల్లులను అమ్మ ఒడికి దూరం చేయడమే సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది” అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.ఈ పథకంపై తొలి నుంచి కూడా ప్రభుత్వం మాట మారుస్తూనే ఉందన్నారు నాదెండ్ల మనోహర్. పేద తల్లులు తమ బిడ్డలను చదివించేందుకు డబ్బులు ఇస్తానని ప్రచారంలో చెప్పారు, కానీ అమలు విషయానికొచ్చేసరికి ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.
కాగా.. అమ్మ ఒడి పథకానికి కొత్త ఆంక్షలు, దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపణలను, విమర్శలను కొట్టిపారేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారని ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జగనన్న అమ్మఒడి పథకానికి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.







