Updated 24th May 2023 Wednesday 5:40 pm
Tirumala Bus Accident : తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు అంటున్నారు. బస్సును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు పోలీసులు.
ప్రమాదానికి గురైన బస్సులో దాదాపు 35మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్తుండగా 28వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగానికి తోడు స్టీరింగ్ కూడా లాక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారందరికి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని బర్డ్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. అలాగే వారు స్వస్థలాలకు వెళ్లేందుకు సాయం చేయాలని టీటీడీ ఈవో అదేశించారు. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటిసారి. ఈ బస్సు వెనకాలే వస్తున్న టీటీడీ సిబ్బంది, కానిస్టేబుల్స్ వెంటనే స్పందించారు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను వెలుపలకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారికి సాయం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించడం జరిగింది.
కాగా, ఈ ప్రమాదం బస్సులోని ప్రయాణికులను, తోటి భక్తులను భయాందోళనకు గురి చేసింది. ఏం జరిగిందో అని అంతా కంగారుపడ్డారు. స్వల్ప గాయాలతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.







