SHOCKING TRAIN ROBBERY: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో కత్తులతో తెగబడ్డ దొంగలు!

UPDATED 3rd JULY 2026 5:00 PM

తుని - అనకాపల్లి మధ్య రైలు ప్రయాణికులకు చుక్కలు చూపించిన దుండగులు

కత్తులు చూపించి నగదు, మూడు సెల్‌ఫోన్ల అపహరణ

ఆన్‌లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి.. కేసు నమోదు చేసిన తుని జీఆర్పీ ఎస్సై సత్తిబాబు

తుని, రెడ్ బీ న్యూస్, జూలై 3:  రైలు ప్రయాణికుల భద్రతకు సవాల్ విసురుతూ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు సభ్యుల దొంగల ముఠా కత్తులతో బీభత్సం సృష్టించింది. తోటి ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి నగదు, మొబైల్ ఫోన్లు దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కత్తులతో బెదిరించి దోపిడీ

బెంగుళూరు నుండి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘోరం చోటుచేసుకుంది. రైల్లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన ప్రయాణికులను నలుగురు గుర్తు తెలియని దుండగులు టార్గెట్ చేశారు. ఒక్కసారిగా కత్తులు బయటకు తీసి, ప్రాణాలు తీస్తామంటూ ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి ₹30,800 నగదుతో పాటు మూడు ఖరీదైన సెల్‌ఫోన్లను లాక్కున్నారు. అనంతరం అనకాపల్లి సమీపంలో రైలు వేగం తగ్గగానే దుండగులు చాకచక్యంగా దిగి పరారయ్యారు.

ఆన్‌లైన్ ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం:

దోపిడీకి గురైన బాధితులు మొదట రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన తుని - అనకాపల్లి మధ్య జరగడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు తుని జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్) స్టేషన్‌లో కేసు నమోదైంది.

దర్యాప్తు ముమ్మరం - ఎస్సై సత్తిబాబు:

ఈ రైలు దోపిడీ ఘటనపై తుని జీఆర్పీ ఎస్సై సత్తిబాబు స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ నలుగురు దొంగల ముఠాను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సత్తిబాబు స్పష్టం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us