హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : సోషల్మీడియా స్టార్స్, బిగ్బాస్ ఫేమ్ దీప్తి సునయన, షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తమ ప్రేమ బంధానికి పుల్స్టాప్ పెడుతున్నట్లు దీప్తి ప్రకటించారు. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎంతో ఆలోచించిన తర్వాత నేను, షణ్ముఖ్ పరస్పర అంగీకారంతో ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్ నిర్ణయం మా మధ్య ఎంతోకాలం నుంచి నడుస్తోంది. ఈక్రమంలోనే మేమిద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించి.. నిజ జీవితాన్ని విస్మరించాం. మా దారులు వేరని అర్థమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని కోరుకుంటున్నాం’’ అని దీప్తి తెలిపారు. బ్రేకప్ ప్రకటించిన అనంతరం ఆమె తన ఇన్స్టాలో కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేశారు. మరోవైపు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి నెటిజన్లు షాక్కు గురి అవుతున్నారు. యూట్యూబ్, డబ్స్మాష్ వీడియోల కోసం దీప్తి-షణ్ముఖ్ మొదటిసారి కలిశారు. వ్యక్తిగతంగా ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఎన్నో రీల్స్, కవర్ సాంగ్స్ చేశారు. దీంతో ఈజంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అనంతరం వీళ్లిద్దరూ తమ స్నేహాన్ని మరో మెట్టు ఎక్కించి ప్రేమగా మార్చుకున్నారు. పలు షోలు, సోషల్మీడియా లైవ్ సెక్షన్స్లలో దీప్తి అంటే తనకెంతో ఇష్టమని షణ్ముఖ్.. అదే మాదిరిగా షణ్ముఖ్ అంటే తనకు అమితమైన ప్రేమ అని దీప్తి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.







