UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 08:30 AM
అరసవిల్లి (రెడ్ బీ న్యూస్): శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. మంగళవారం స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వామి వారి తొలిపూజలో పాల్గొని క్షీరాభిషేకాన్ని తిలకించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ప్రధాత సూర్యనారాయణ మూర్తిని దర్శించుకొవడం ఏంతో ఆనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని సూర్యనారాయణ స్వామిని కోరుకున్నట్లు మంత్రి ధర్మాన వివరించారు. భగవంతుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కొరుకుంటున్నట్లు తెలిపారు. ఆదిత్యుని తొలిపూజ జరుపుకుని, దర్శించుకునే భాగ్యం కలగిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణుడి రథసప్తమి వేడుకలు ప్రతీ ఏటా విశాఖ శారదా పీఠం తొలిపూజతో ప్రారంభం అవుతాయి. అయితే ఈఏడాది వేడుకలకు విశాఖ శారదా పీఠం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అనివార్య కారణాల వలన చివరి నిమిషంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆలయ పాలకమండలి సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలిపూజ నిర్వహించారు.
మరోవైపు మంగళవారం ఉదయం ప్రారంభమైన రథసప్తమి వేడుకల్లో సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలుచుని తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పోలీసులు, రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులు మాత్రం వీఐపీ సేవల్లో తరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.







