* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
UPDATED 15th JULY 2020 THURSDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. స్థానిక లూథరన్ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 పరీక్షా శిబిరాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షకు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులను శానిటైజర్, సబ్బుతో శుభ్రపరుచుకోవాలని చెప్పారు. అవసరాల మేరకు మాత్రమే ప్రజలు బయటకు రావలే తప్ప మిగిలిన సమయాల్లో ఇండ్లకు మాత్రమే పరిమితం కావాలన్నారు. పట్టణంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉందని, ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో నెగిటివ్ వచ్చిన కూడా వారు బయటకు రాకూడదని, వారికి తిరిగి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పరంగా రెవెన్యూ, వైద్య, పోలీసు, మున్సిపాలిటీ, తదితర శాఖలు నిత్యం కరోనా కేసులపై తమ సేవలను అందిస్తున్నారని ప్రజలందరూ విజ్ఞతతో అధికారులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా కేసులు తప్ప మిగిలిన పాజిటివ్ కేసులు హోం క్వారంటైన్ లోనే ఉండి ఆరోగ్యం పరిరక్షించుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రతీ వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలని, ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో కరోనా కేసులు నమోదుకాబడిన కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ తన వాహనం నుంచి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లిబాబు, మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్, డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సిఐ జయకుమార్, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, టిపిఎస్ ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







