పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: కొడుకును చూసేందుకని వెళ్లే వారి ఇంటిని దోచేసిన సంఘటన మండలంలోని జె.తిమ్మాపురంలో చోటుచేసుకుంది. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన యెన్నం రామన్నచౌదరి తన భార్య తో కలిసి హైదరాబాద్లో ఉంటు న్న కుమారుడిని చూసేందుకు నెల కిందట వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు ఇదే అదునుగా భావించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం రాత్రి బంధువులు వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి యజమానులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి చూసుకుని లబోదిబోమన్నారు. 38 తులాల బంగారం, 16 కిలోల వెండి, రూ.3.41 లక్షల నగదును దుండగులు దోచుకుపోయారని పోలీసులు తెలిపారు. భారీ చోరీ కావడంతో జిల్లా పోలీసు అధికారులు వచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించి ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్యర్యంలో సీఐ జయకుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ మురళీమోహన్ విచారణ చేపట్టారు.







