హైదరాబాద్: తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చిన 317 జీవో కారణంగానే ఉపాధ్యాయులు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురికావొద్దన్న రేవంత్.. మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలను ఇష్టానుసారం విభజించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రైతులు వరి వేయకుండా నిషేధించి.. సీఎం కేసీఆర్ మాత్రం తన ఫాం హౌస్లో వరి సాగు చేశారంటూ రేవంత్ ఆరోపించారు. అంతకముందు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు రేవంత్ని దిగ్బంధించారు. తన ఇంటి ఆవరణలోకి పోలీసులు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుమతిలేకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీశారు.







