UPDATED 9th JUNE 2026 4:00 PM
* కేంద్ర రవాణా శాఖ సరికొత్త యోచన.. త్వరలోనే నిర్ణయం!
* ఆర్టీవోల చుట్టూ తిరిగే తిప్పలకు బ్రేక్.. సమయం, డబ్బు ఆదా!
* బదిలీలు, పర్మిట్ల ప్రక్రియ కూడా ఇకపై పూర్తిగా ఆన్లైన్!
న్యూఢిల్లీ, రెడ్ బీ న్యూస్, జూన్ 9 : దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (DL) చెల్లుబాటు (వ్యాలిడిటీ) గడువును ఏకంగా 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. ఈ విప్లవాత్మక నిర్ణయం అమల్లోకి వస్తే వాహనదారులు పదే పదే లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల అటు ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు, ఇటు ఆర్టీవో అధికారులపై కూడా పనిభారం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
డిజిటల్ బాటలో రవాణా సేవలు.. లైసెన్స్ గడువు పెంపుతో పాటు రవాణా రంగంలో మరికొన్ని కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. వాహన యాజమాన్య బదిలీ (ఓనర్షిప్ ట్రాన్స్ఫర్), పర్మిట్ల పునరుద్ధరణతో పాటు ఇతర రవాణా సేవలను పూర్తిగా ఆన్లైన్ పరిధిలోకి తీసుకురావాలని జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.







