హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: చాలాకాలం తర్వాత ప్రభాస్ నటించిన పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది. ఇదే వేడుకలో ప్రభాస్ అభిమానులు చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ప్రభాస్ లుక్స్, నటన చాలా కొత్తగా ఉన్నాయి. ఆయన రొమాంటిక్గా కనిపించి ఫిదా చేస్తున్నారు. పూజాహెగ్డే అందం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నేపథ్య సంగీతం ట్రైలర్కు ప్రధానబలంగా నిలిచింది. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్: ఆర్.రవీందర్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.







