Yuvagalam Padayatra: కోడుమూరులో ఉద్రిక్తత.. నారా లోకేశ్ దళితులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే, దళిత సంఘాల నిరసన

Updated 3rd May 2023 Wednesday 11:10 am

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరులో సాగుతోంది. పాదయాత్ర సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నారా లోకేశ్ దళితులకు, ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. దళితులకు, ఎమ్మెల్యేకు నారా లోకేశ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ నల్ల కండువాలు, రిబ్బన్‌లు కట్టుకొని నిరసన తెలిపారు. నారా లోకేశ్ పాదయాత్ర‌ను అడ్డుకోవడానికి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంపయ్య సర్కిల్‌లో ఎమ్మెల్యే, దళిత సంఘాలు, వైసీపీ కార్యకర్తలు బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేశ్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పాదయాత్ర ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకొన్నారు. ఎమ్మెల్యేను, కార్యకర్తలను పోలీసులు వారించారు. అనంతరం ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, నిరసనకు దిగారు. లోకేశ్ ఎమ్మెల్యే‌కు క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ను అరెస్ట్ చేసి నాగలాపురం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నారా లోకేశ్ పాదయాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us