UPDATED 10th JULY 2017 MONDAY 7:00 PM
పెద్దాపురం : ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 12న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర హోటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ విధానాల కారణంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాల కాలం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు జరపలేదని ఎద్దేవా చేశారు. అలాగే రేషన్ షాపులను మూసివేసే ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు. అలాగే పెంచిన పన్నులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నింటిపై పోరాటం చేసేందుకు తమ పార్టీ ఈ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో ప్రజలు ఈ ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నక్కా కిశోర్, పట్టణ కార్యదర్శి బైలపూడి సూరిబాబు, ఏఐటీయూసీ నాయకులు బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.







