అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇంకా దూకుడుగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళలపై దుష్ర్పచారం, అసెంబ్లీలో జరిగిన ఘటనలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తీర్మానించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని, షో చేసే వారిని పక్కన పెడతామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంతమంది కర్చీఫ్ వేసుకుని కూర్చుంటున్నారని, కొందరు పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదని మండిపడ్డారు. రాజకీయాలు మారాయని, అందుకు తగ్గట్టుగా మనం కూడా మారాలన్న చంద్రబాబు... లేకపోతే పక్కన పెట్టేస్తానని హెచ్చరించారు. కొంతమంది నాయకులు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భువనేశ్వరి ఇచ్చిన ప్రకటనపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. ఎంత వరకు చెప్పాలో అంతే చెప్పారని, ప్రజల్లోకి వెళ్లిందనే భావన వ్యక్తమైంది.







