Updated 4th July 2023 Tuesday 11:25 am
Roja Selvamani : ఏపీ మంత్రి రోజా సెల్వమణి (Roja Selvamani) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై పంచ్లతో విరుచుకుపడ్డారు. రికార్డులు సృష్టించాలన్న, రికార్డులు తిరగరాయాలన్న జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం అంటూ పేర్కొన్నారు. ‘ హాయ్ ఏపి, బాయ్ బాయ్ బీపీ(బాబు, పవన్ కళ్యాణ్)… వన్స్ అగైన్ వైఎస్సార్ సీపీ’ అంటూ రోజా పేర్కొన్నారు. అంతేకాదు.. ‘ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు, ఇన్స్పిరేషన్ స్టార్ జగన్ ‘అంటూ పంచ్ల వర్షం కురిపించారు.
రికార్డులు సృష్టించాలన్న, రికార్డులు తిరగరాయాలన్న జగన్ కే సాధ్యం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్ కాలిగోటికి కూడా సరిపోరు అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు సిగ్గుపడాల్సిన రోజు. తన హెరిటేజ్ సంస్థకోసం విజయ డైరీని మూయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ రోజా ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం విజయ డైరీని ఇవాళ వైయస్ జగన్ పున: ప్రారంభిస్తున్నారు అంటూ రోజా చెప్పారు. ఇవాళ చిత్తూరు జిల్లా వాసులకు శుభదినమని, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ డైరీకి జగన్ ప్రాణం పోస్తున్న రోజు అంటూ రోజా చెప్పారు.
ఏపీ ప్రజలు మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కసితో ఉన్నారని, ఎంత మంది పవన్లు వచ్చినా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్ మోహన్ రెడ్డేనంటూ రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పాడి రైతుల జీవితాల్లో జగనన్న వెలుగు నింపుతున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే ఎమ్మెల్యే అయ్యి 14ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గుపడాల్సిన రోజు అంటూ రోజా వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. విజయ డైరీ అప్పులు తీర్చి అమూల్ సంస్థ ద్వారా పున: ప్రారంభానికి భూమి పూజ చేస్తున్న విషయాన్ని రోజా గుర్తు చేశారు.







