UPDATED 11th MARCH 2022 FRIDAY 03:40 PM
Cabinet Expansion Soon In AP : ఏపీలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే సీఎం జగన్ రెడీ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందుకు కారణం త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ చేయడం, వైసీపీ ఎల్పీ భేటీ జరుగుతుండడమే కారణం.
ఈనెల 15న జరిగే వైసీపీ ఎల్పీ భేటీ సమావేశంలో ఏపీ మంత్రి వర్గ విస్తరణతో పాటు ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలకు జగన్.. పూర్తిగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022, మార్చి 11వ తేదీ శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దాదాపు.. మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఏడుగురు మంత్రులను మినహాయించి మిగతా మంత్రులందర్నీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ మంత్రివర్గంలో త్వరలో 17 మంది కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి.చాలాకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతేగాకుండా పునర్ వ్యవస్థికరణలో పదవులు కోల్పోయిన వారంతా పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు సీఎం జగన్. వారందరికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఏపీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యానారాయణ కొత్త కేబినెట్లోనూ కొనసాగే అవకాశం ఉంది. ఇక.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.. రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సైతం త్వరలోనే ఏర్పడే కొత్త మంత్రివర్గంలో ఉంటారని సమాచారం. అటు.. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సైతం కొత్త మంత్రివర్గంలో ఉండనున్నానని తెలుస్తోంది.







