భోపాల్ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నటించిన ఓ వీడియో వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ వీడియో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియో మూడ్రోజుల్లో తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సన్నీ లియోన్తో పాటు ఆ పాట ఆలపించిన గాయకులను హెచ్చరించారు. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరిట హిందీలో ఓ వీడియో సాంగ్ విడుదలైంది. షరీబ్, తోషి ఈ పాటను ఆలపించారు. సన్నీ లియోన్ నర్తించారు. 1960లో వచ్చిన ‘కోహినూర్’ చిత్రంలోని ‘మధుబన్ మే రాధిక నాచే రే’ అనే పాటలోని పల్లవిని ఈ పాట పోలి ఉంటుంది. పాత పాటను మహ్మద్ రఫీ ఆలపించగా.. దిలీప్ కుమార్ నటించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న కొత్త పాటను విడుదల చేశారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన కొందరు అర్చకులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తాజాగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా స్పందించారు. కొందరు కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘మధుబన్ మే రాధిక’ కూడా ఆ కోవకు చెందినదేనని, ఈ వ్యవహారంలో సన్నీ లియోన్, షరీబ్, తోషి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడ్రోజుల్లోగా వీడియో తొలగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో మంగళ సూత్రాన్ని ఉద్దేశిస్తూ ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ప్రకటనపైనా నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ ప్రకటనను ఆ సంస్థ ఉపసంహరించుకుంది. డాబర్ రూపొందించిన మరో యాడ్ సైతం ఇలాంటి హెచ్చరికలే ఎదుర్కొంది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.







